Seshachalam Forest: తిరుపతి వైపునకు మంటలు
Seshachalam Forest: మంగళం అటవీ ప్రాంతంలోని అవ్వారికోనలో ప్రారంభమైన మంటలు తిరుపతి వైపునకు కూడా వ్యాపించాయి.
Seshachalam Forest:(ఫైల్ ఇమేజ్)
Seshachalam Forest: రెండు రోజుల క్రితం శేషాచలం అడవుల్లో అంటుకున్న మంటలు శరవేగంగా వ్యాపిస్తూ వందలాది ఎకరాలను మాడ్చి మసిచేస్తోంది. గురువారం మంగళం అటవీ ప్రాంతంలోని అవ్వారికోనలో ప్రారంభమైన మంటలు కరకంబాడి వైపునకు దాదాపు 5 కిలోమీటర్ల మేర విస్తరించాయి. నిన్న తిరుపతి వైపునకు కూడా వ్యాపించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మంటలు కాలనీవైపునకు రాకుండా అదుపు చేసిన టీటీడీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మరోవైపు, కార్చిచ్చు కారణంగా అరుదైన వృక్షాలు కాలి బూడిద కాగా, వన్యప్రాణులు కూడా పెద్ద ఎత్తున మరణించి ఉంటాయని భావిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం శివారులోని కోనంకి అటవీ బీట్లో నిన్న వ్యాపించిన మంటల కారణంగా వంద ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అటవీశాఖ అధికారులు గ్రీన్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ ప్రొటెక్షన్ ఫోర్స్, తితిదే అటవీ సిబ్బంది దాదాపు 40 మంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాత్రంతా మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే అటవీప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు సకాలంలో అప్రమత్తమై అదుపు చేశారు. ఈసారి మాత్రం విపరీతమైన వేడి, తీవ్రమైన ఎండల కారణంగా మంటలను అదుపుచేయడం సాధ్యపడలేదు. సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో వందలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. దీంతో పొగ దట్టంగా కమ్ముకుంది. మంటలకు గాలి తోడవడంతో బూడిద పెద్ద ఎత్తున సమీప గ్రామాలపైకి విస్తరించింది