ఆంధ్రా ఊటీగా అరకుకు మంచి పేరు ఉంది. జీవితంలో ఒక్కసారి అయిన ఆ అరుకు అందాలను చూడాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఆ అరకు అందాలను మనం సరికొత్తగా చూడొచ్చు. అరుకు అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. దీనికి పర్యాటకుల నుండి మంచి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఐదు విస్టోడామ్ కోచ్లు ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఆరు అద్దాల పెట్టెలతో రైలు త్వరలోనే చక్కర్లు కొట్టనుంది... ఒక్కో కోచ్లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మాత్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే అవకాశం ఉండేది . కానీ.. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో 270 మంది అరకు అందాల్ని అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది.
వీటి ప్రత్యేకత..
ఈ విస్టాడోమ్ కోచ్లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. రొటేటింగ్ సీట్లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్నా ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.