కాసేపట్లో ఏపీలో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాల పరీక్షలు ... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు ఈ ఉదయం 10గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,26,728 పోస్టుల భర్తీకి21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఐదు రోజులపాటు నిర్వహించే రాత పరీక్షలు ఈ నెల 8వ తేది వరకు జరగనున్నాయి. ఉదయం ఒక పరీక్ష , మధ్యాహ్నం మరో పరీక్ష ఉంటుంది. తొలిరోజు 15,49,941 మంది పరీక్షలు రాయనున్నారు. మొదటిరోజు మొత్తం 4,478 కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి.
గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ పలు సూచనలు చేశారు.
_ హాల్ టికెట్తోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి
– పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
– పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరు. ఎవరైనా మధ్యలో వెళ్లిపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
– హాలు టికెట్తోపాటు అభ్యర్థి గుర్తింపు కోసం ప్రభుత్వం జారీచేసిన ఫొటో ఆధార్ కార్డు, పాన్కార్డు, ఓటరు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ కార్డును అభ్యర్థులు తీసుకువెళ్లాలి.
– హాలు టికెట్లో ఫోటో సక్రమంగా లేకపోతే ఫొటోపై గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి.
– ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
– బ్లూ లేక బ్లాక్ పెన్ మాత్రమే అనుమతిస్తారు. పెన్సిల్ లేదా జెల్పెన్స్, వైటనర్లను అనుమతించరు.
పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులందరూ ఎటువంటి వదంతులను నమ్మవద్దనీ, పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయనున్నట్లు విజయకుమార్ స్పష్టంచేశారు.