వారిపై చర్యలు తీసుకోండి : డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు.. ఈ సందర్బంగా వైసీపీ పార్టీ తోపాటు వ్యక్తిగతంగా తనను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారంటూ కొందరిపై ఫిర్యాదు చేశారు.
ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి విజయసాయి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్, ఫేస్బుక్, హెలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్లకు సంబంధించిన ఆధారాలు, వాటి అడ్రస్ లింక్లు, పోస్టింగ్లను డీజీపీకి అందజేశారు.
తన ఫోటోను అసభ్యంగా చిత్రీకరించి.. వాడకూడని పదజాలంతో కొందరు పోస్టింగ్లు పెడుతున్నారని, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన మనసును గాయపరిచేలా, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు గౌతమ్ సవాంగ్ బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు.
ఇందుకోసం సీఐ స్థాయి పోలీసుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారిని గుర్తించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. కాగా రెండు రోజులకిందట ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కూడా కొందరు అసత్య ప్రచారానికి తెరలేపడంతో పోలీసు వ్యవస్థ రంగంలోకి దిగింది.