రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీని నిలుపుకోవాలన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రాజ్యసభలో రాష్ర్టపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నీతి అయోగ్ భేటీలో ఏపీ సీఎం జగన్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరాన్ని సవరించిన అంచనాలతో నిర్ణీత గడువులోగా నిర్మించాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కాకినాడ పెట్రో కారిడార్ను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్లో మినహాయించిన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను చేర్చాలన్నారు.