ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది : విజయసాయిరెడ్డి
కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ.. కేంద్రం ఆ సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఆయన ప్రశ్నించారు. పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. విభజన హామీల్లో భాగంగా.. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. తమిళనాడుకు కియా మోటార్స్ తరలివెళ్లే సమయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని, ఏపీకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆ ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందని ఆయన అన్నారు.
ఏపీకి కియా మోటార్స్ రావడంలో చంద్రబాబు కృషి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కియా మోటార్స్ తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. కియా మోటార్ ఆంధ్రలో మరో ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. కియా మోటార్స్పై పార్లమెంట్ వెలుపల కూడా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.