గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీతో తనకున్న ఇరవై ఏళ్ళ బంధాన్ని తెంచేసుకున్నట్టే కనబడుతోంది. ఆయనకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో టీడీపీకి సంబంధించిన కవర్ ఫోటోలు, ప్రొఫైల్ ఫోటోలను తొలగించి వాటి స్థానంలో సాధారణ ఫోటోలను చేర్చారు. అంతేకాదు టీడీపీలో తనకు కష్టాలు వచ్చినప్పుడు తన వెంట ఎవరూ లేరని.. ఇవాళ అవసరం కోసం తనను బుజ్జగిస్తున్నారనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతానని తేల్చి చెప్పారు.
దీంతో టీడీపీ చేసిన చివరి ప్రయత్నాలు, బుజ్జగింపులు ఫలించలేదు. వంశీ దారికి వచ్చేలా పరిస్థితి కనిపించకపోవడంతో నియోజకర్గంలోని కేడర్ జారిపోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధినేత చంద్రబాబు. ఐదుగురు నాయకుల్ని తీసుకువచ్చి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కొనకళ్ల నారాయణ, ముద్దరబోయిన వెంకటేశ్వర్లు, వర్ల రామయ్య, బచ్చుల అర్జునుడు, గద్దె అనురాధలతో నియమించిన కమిటీకి గన్నవరం బాధ్యతలు అప్పగించారు. వీరంతా పార్టీ సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ, స్థానిక సంస్థల ఎన్నికలకు నియోజకవర్గంలోని కార్యకర్తల్ని సిద్ధం చేయడం వంటి బాధ్యతలు చేపట్టనున్నారు.