విశాఖపట్నం, విజయవాడ మధ్య మరో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకోసం డబుల్ డెక్కర్ ఏసీ ఎక్స్ప్రెస్ రైలు ఉదయ్ రానుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఉదయ్ ట్రైన్ మొదటిసారిగా తూర్పుకోస్తా రైల్వే పరిధిలోకి రానుంది. దీంతో వాల్తేరు రైల్వే అధికారులు.. ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.
విశాఖ విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలు పరుగులు పెట్టబోతోంది. 350 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ఉదయ్ ట్రైన్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం విశాఖ నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలులో సీటింగ్ అసౌకర్యంగా ఉందంటూ తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో డబుల్డెక్కర్ ర్యాక్ల నిర్మాణం చేపట్టారు. పంజాబ్లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారుచేశారు. ఈ ఏడాదే ఉదయ్ ర్యాక్లు కూడా నిర్మించారు. సీట్లు కూడా సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశారు.
కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉదయ్ రైలులో ప్రత్యేక ఆధునిక సాంకేతిక సదుపాయాలున్నాయి. విశాలమైన అద్దాలు, విమానంలో ఉన్నట్టుగా సీట్ల అమరిక, కాళ్లు పెట్టుకునేందుకు అనుకూలమైన స్థలం, వైఫై సదుపాయం, స్క్రీన్ల ద్వారా.. ముందు వచ్చే స్టేషన్ను తెలుసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ అధునాతన రైలు విశాఖ, విజయవాడ మధ్య పట్టాలెక్కనుంది. అయితే ఎప్పుడు పరుగులు పెట్టే విషయాన్ని వాల్తేరు డివిజన్ అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయినా ఉదయ్ రాక కోసం రైల్వే ప్రయాణీకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.