ఎన్టీఆర్ భవన్పై విజయసాయి.. లోటస్ పాండ్పై బుద్దా .. ఆసక్తికర వాఖ్యలు
ఒకపక్కా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
ఒకపక్కా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. హైదరాబాద్ లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కరోనా హాస్పిటల్ కు ఇస్తే తెలంగాణా ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందని బాబుకు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబర్చాలి. పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుంది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
అయితే దీనిపైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న లోటస్ పాండ్ ఇంద్ర భవనం,బెంగుళూరు లో ఖాళీగా ఉన్న యలహంక రాజ ప్రసాదం కరోనా ఆసుపత్రికి ఇవ్వాలని,ఆధునిక వసతులు ఉన్న భవనాలు కావడంతో కరోనా రోగులకు మంచి వైద్యం అందించే అవకాశం ఏర్పడుతుంది అని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, వైఎస్ జగన్ గారు పెద్ద మనస్సు చేసుకొని ఆ భవనాలు ఇస్తే ప్రజా ధనం కొట్టేసి నరకానికి వెళ్లిన వైకాపా ఆత్మకి కొంత ఊరట వచ్చే అవకాశం ఉంటుంది విజయసాయి రెడ్డి గారు అంటూ బుద్దా పేర్కొన్నారు.
ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 81 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1097 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు 231 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 835 గా ఉంది. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని ఆరోగ్యశాఖ వెల్లడించింది.