తిరుమలలో సంపూర్ణ పాస్టిక్ నిషేధానికి టీటీడీ చర్యలు
-మరో నెల్రోజుల్లో తిరుమలకు వాటర్ బాటిళ్ల రవాణా రద్దు -ఉచితంగా సరఫరా చేస్తున్న సురక్షిత మంచినీరు స్వీకరించాలని భక్తులను కోరుతున్న టీటీడీ అధికారులు
(తిరుమల, శ్యామ్ నాయుడు)
తిరుమలలోని అన్ని టిటిడి కార్యాలయాల్లో వారంలోపు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించి జలప్రసాదం నీటిని స్వీకరించాలని సూచించామని, ఈ మేరకు ఆయా విభాగాల అధికారులు ధ్రువీకరణ పంపుతారని తెలిపారు. అన్ని విశ్రాంతి గృహాలకు 15 రోజుల్లో జలప్రసాదం నీటిని సరఫరా చేసి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంపై భక్తులకు అవగాహన కల్పిస్తామన్నారు.
గదుల్లో భక్తులు నీటిని తాగేందుకు వీలుగా జగ్గులు, కాగితం గ్లాసులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టిటిడి ఆరోగ్యశాఖాధికారి ఆధ్వర్యంలో 15 రోజుల్లో అన్ని హోటళ్లు, అల్పాహారశాలల యజమానులతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకాన్నిపూర్తిగా నిలిపివేయాలని కోరతామన్నారు. ఒక నెల తరువాత తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల సరఫరాకు సంబంధించి లైసెన్సును రద్దు చేస్తామని, అలిపిరి చెక్పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించే సమయంలో ప్లాస్టిక్ బాటిళ్లు తిరుమలకు తీసుకెళ్లకూడదని భక్తులకు అవగాహన కల్పిస్తామని వివరించారు.
తిరుమలలో 15 రోజుల క్రితం 23 మంది లడ్డూ దళారులను భద్రతా సిబ్బంది గుర్తించారని అదనపు ఈవో తెలిపారు. ఈ క్రమంలో లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రెండంచెల స్కానింగ్ విధానాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్సుల్లో మొదట లడ్డూ టోకెన్లను స్కాన్ చేసి భక్తులకు అందిస్తారని, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని స్కానింగ్ పాయింట్ వద్ద మరోసారి స్కాన్ చేసేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రెండోసారి స్కాన్ చేసిన సమాచారం మాత్రమే లడ్డూ కౌంటర్లకు చేరుతుందన్నారు. పిఏసిల్లో లాకర్లు కేటాయించే సమయంలో తాళం చెవిని భక్తులకు అందిస్తామని, ఖాళీ చేసేటపుడు తాళం, తాళం చెవిని భక్తులు అందించాల్సి ఉంటుందని చెప్పారు.
వకుళాభవనం తరహాలోనే కౌస్తుభం, నందకం, పాంచజన్యంలోని గదుల అద్దెను రూ.1000/-గా బోర్డు నిర్ణయించిందన్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఎస్ఇ-2, ఇఇ(ఎఫ్ఎంఎస్), ఆర్-2 డెప్యూటీ ఈవో ప్రతినిత్యం తనిఖీలు చేపట్టాలని ఆదేశించామన్నారు. అన్ని విశ్రాంతి గృహాల వద్ద పచ్చదనం పెంచుతున్నట్టు తెలిపారు. జిఎంఆర్ సంస్థ విరాళంగా తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిందని, నవంబరు నెలాఖరులో మొదటి దశ పనులు చేపడతారని, గార్డెన్ సూపరింటెండెంట్, డిఎఫ్వో ఈ పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి ఎస్ఇ-2 నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, రిసెప్షన్ డెప్యూటీ ఈవోలు బాలాజి, దామోదర్, ట్రాన్స్పోర్టు జిఎం శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.