నేడు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత
* మూడో విడతలో రూ.2వేలు చొప్పున పెట్టుబడి సాయం * ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 పెట్టుబడి సాయం * నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ
వైఎస్సార్ రైతుభరోసా - పీఎం కిసాన్ మూడో విడత నిధులు, నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను ప్రభుత్వం ఇవాళ అందించనుంది. మొత్తం మూడు విడతల్లో 13వేల 500 పెట్టుబడి సాయం అందిస్తానన్న జగన్ సర్కార్.. ఇప్పటికే రెండు విడతల్లో 11వేల 500 చెల్లించింది. ఇవాళ మూడో విడతలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో 2వేలు చొప్పున జమ చేయనుంది. వైఎస్సార్ రైతుభరోసా - పీఎం కిసాన్ మూడోవిడత కింద ఒకవేయి 120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు 646 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ మూడో విడత నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. నవంబర్ నెలాఖరులో సంభవించిన నివర్ తుపాను వల్ల 12.01 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ విపత్తు వల్ల 8లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయారు. ఇప్పుడు వీరి ఖాతాల్లో 646 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్ జమ చేయనున్నారు. 51లక్షల 59 వేల మంది రైతుల ఖాతాల్లో ఒకవేయి 120 కోట్లు మొత్తాన్ని జమ చేస్తున్నారు.