Theaters: లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా విడుదల కాని సినిమాలు

Theaters: ఏపీలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతుండడంతో సినిమా విడుదలకు ఆటంకం

Update: 2021-07-04 13:09 GMT

థియేటర్స్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Theaters: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఇప్పుడిప్పుడు రోజువారి కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రంగాలు, వ్యవస్థలు పునఃరుద్ధరించి తిరిగి జీవనోపాధిని పొందుతున్నారు. కానీ సినిమా ఫీల్డ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 20 తేది నుంచి సంపూర్ణంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఎవరి పనులు వారి చేసుకునే విధంగా అనుమతిచ్చింది. దాంతో సినిమా థియేటర్ల మీద ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనోపాధి పొందుతున్న ఎంతోమంది తమ కష్టాలు తీరిపోయాయి అనుకున్నారు. కానీ దేవుడు వరమిచ్చినా... పూజారి ఇవ్వలేదన్నట్లు ప్రభుత్వం వరమిచ్చిన దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడం లేదు. దాంతో థియేటర్స్‌లో పని చేసే సిబ్బంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కోట్లు వెచ్చించి సినిమాలు నిర్మిస్తారు సినీ నిర్మాతలు. ప్రస్తుతం ఏపీలో సినిమా ప్రదర్శనలకు అనుమతి లేదు. దాంతో ఒకే రాష్ట్రంలో తమ సినిమాను విడుదల చేస్తే ఆర్ధికంగా బాగా నష్టపోతామంటూ నిర్మాతలు సినమాలను విడుదల చేయడం లేదు. ఐతే సినీ పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సినిమాలు విడుదలయ్యేట్లు చూడాలని థియేటర్ల సిబ్బంది కోరుతున్నారు. లేదా అప్పటి వరకు ప్రభుత్వం తమకు ఆర్ధికంగా ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు.

ఏపీలో సినిమా థియేటర్లు ఓపెన్‌ చేయాలా...? లేదా...? అనేది అక్కడి కరోనా ఉధృతిని బట్టి ఆధారపడి ఉంటుంది. పరిస్థితిని బట్టి దీనిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు థియేటర్ల మీదే ఆధారపడి ఉపాధి పొందేవారిని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడమో లేక మరో ఉపాధిబాటను చూపడమో చేస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News