ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంలో టీడీపీకి రాష్ట్రపతి కార్యాలయం షాక్!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అనర్హుడిగా గుర్తించాలంటూ రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అనర్హుడిగా గుర్తించాలంటూ రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం తోసిపుచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీగానే కొనసాగుతారని స్పష్టం చేసింది. కాగా గతంలో విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే, లాభదాయక పదవిలో ఉన్నారనే ఆరోపణలతో విజయసాయిరెడ్డిని రాజ్యసభ నుంచి అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ కోరింది. దీనిపై రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేసింది.
రాష్ట్రపతి ఈ ఫిర్యాదును పరిశీలించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రపతి కార్యాలయం వివరణ కోరింది. ఏపీ ప్రభుత్వం జూలై 4 న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, ప్రత్యేక ప్రతినిధి కార్యాలయాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బ్రాకెట్ నుండి బయటకు తెచ్చేల ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అందువల్ల విజయసాయి రెడ్డిని అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం లేదని అధ్యక్ష కార్యాలయానికి తెలిపింది. ప్రభుత్వ వివరణతో ఏకీభవించిన రాష్ట్రపతి కార్యాలయం.. టీడీపీ వేసిన ఫిర్యాదును కొట్టివేసింది. కాగా 2015 లో రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీలో నెంబర్ 2 గా ఉన్నారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా విజయసాయితో చర్చిస్తారు. విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం తోపాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు జగన్.