Case Filed on KTR: కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు.. అసలు ఆరోపణలు ఏంటంటే...
Telanana ACB filed case on KTR over alleged irreguarities in Formula E car racing: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ-కారు రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద 13(1)A, 13(2) అలాగే 409, 120 B సెక్షన్స్ కలిపి మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2023 లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పరిసరాల్లో జరిగిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంపై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్ములా కార్ రేసింగ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. భారీగా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనేది అందులో ప్రధానమైన ఆరోపణ.
ఈ కారు రేసింగ్ నిర్వహణ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల నుండి అప్పట్లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఇందుకోసం హెచ్ఎండిఏ బోర్డ్, తెలంగాణ ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటి ప్రక్రియ లేకుండానే ఈ నిధులు కేటాయించారనేదే ప్రధాన ఆరోపణ.
ఇదే విషయమై గతంలోనే అరవింద్ కుమార్ను (IAS Arvind Kumar) ప్రశ్నించగా.. అప్పట్లో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే తాను హెచ్ఎండిఏ నుండి రూ. 55 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాజాగా ఈ కేసు మరోసారి తెరపైకి రావడం, కేటీఆర్, అరవింద్ కుమార్లపై కేసు నమోదవడంతో కేటీఆర్ అరెస్ట్ (Will Telangana police Arrest KTR in Formula E car racing case) చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.