ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నరీతిలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి కాలుదువ్వుతున్నాయి. ఎన్నికల వేళా అన్ని పార్టీలలోకి వలసలు కామన్.. వైసీపీలో సీటు రాని నేతలు టీడీపీలోకి.. ఆ పార్టీలో సీటురాని నేతలు ఇటు వైసీపీ, జనసేన వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దాసరి జై రమేష్ వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. గతనెల వైసీపీ అధినేత జగన్ ను జై రమేష్ కలిశారు. త్వరలో ముహూర్తం చూసుకుని పార్టీలో చేరుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తన తమ్ముడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు చేరిక విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు.
అయితే ఇవాళ గన్నవరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బాలవర్ధన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన అన్న జై రమేష్ ఎటు పయనిస్తే అటు ఉంటానని చెప్పారు. దీంతో ఆయన కూడా వైసీపీలో చేరడం ఖాయమైంది. సమావేశం అనంతరం మాట్లాడిన జై రమేష్.. తన తమ్ముడితో కలిసి ఈనెల 9న జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నాం అని స్పష్టం చేశారు. కాగా టీడీపీ కోసం తమ ఆస్తులు దారబోశామని.. కానీ తమ శ్రమను గుర్తించడంలో అధినాయకత్వం విఫలమైందని జై రమేష్ అన్నారు.