విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనలో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం వారు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారిని టిడిపి నేతలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులు పరామర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించి బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేంద్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఘటన గురించి పూర్తిగా తెలుసుకోకముందే ముఖ్యమంత్రి జగన్ యాజమాన్యం ప్రతినిధులను ఎయిర్పోర్టులో కలవడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు.
ఇక ముఖ్యమంత్రి జగన్ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించారనీ అయితే రూ.కోటి ప్రభుత్వం ఇచ్చే పరిహారమా? లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా? అనేది స్పష్టం చేయాలనీ అన్నారు. ఒకవేళ కంపెనీ నుంచి అయితే ఇంతకు పదిరెట్లు పరిహారం ఇవ్వాలనీ అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు..ఇక పరిశ్రమ ఉన్న ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి సమీప గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు..