ఏపీలో వరుస కిడ్నాప్‌ల కలకలం

* అపహరణకు గురవుతున్న సర్పంచ్‌ అభ్యర్థుల బంధువులు * తూ.గో.జిల్లా గొల్లలగుంటలో సర్పంచ్‌ అభ్యర్థిని భర్త కిడ్నాప్‌ * కాళ్లు, చేతులు కట్టేసి శ్రీనివాస్‌రెడ్డిని అడవిలో పడేసిన దుండగులు ‌

Update: 2021-01-31 12:33 GMT

Representational Image

తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేగింది. జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచ్‌ అభ్యర్థిని భర్త పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అపహరించుకుపోయారు దుండగులు. నిన్న సాయంత్రం నుంచి శ్రీనివాసరెడ్డి కనిపించకపోవడంతో బంధువులు సమీప ప్రాంతాల్లో వెతికారు. అయితే గోవిందపురం అటవీప్రాంతంలో శ్రీనివాసరెడ్డిని పశువుల కాపరులు గుర్తించారు. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, ఓ చోట పడేసి ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు పశువుల కాపరులు.

మరోవైపు అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్నను కిడ్నాప్‌ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక ప్రాంతమైన అడవి మారంపల్లిలోని ఓ ఆలయానికి వెళ్తుండగా ఈరన్నను కారులో వచ్చి ఎత్తుకెళ్లారు దుండగులు. అనంతరం మత్తుమందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి చితకబాదారు. మత్తులో నుంచి కోలుకున్నాక సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కత్తులతో బెదిరించినట్టు బాధితుడు తెలిపాడు. కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఈరన్న పోలీసులను ఆశ్రయించాడు.

కిడ్నాప్‌నకు గురైన ఈరన్నను మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో బాధితుడిని పరామర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని తెలిపారు. టీడీపీ అడగా ఉంటుందని హామీ ఇచ్చారు చంద్రబాబు.

Tags:    

Similar News