రాజోలు వైసీపీలో.. జనసేన ఎమ్మెల్యే రాపాక కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి దగ్గరవుతున్నారని.. త్వరలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాజోలు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు అప్రమత్తమవుతున్నాయి. వైసీపీ ఇంచార్జి బొంతు రాజేశ్వరరావును కాదని ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీకి నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కూడా బొంతు వర్గం భగ్గుమంటోంది. దీనికి తోడు ఇటు రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలో చేరడానికి పావులు కదుపుతున్నారని తెలుసుకున్న బొంతు వర్గం అధిష్టానం వద్దకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎవరొచ్చినా తానే నియోజకవర్గ ఇంఛార్జిగా ఉంటానని బొంతు రాజేశ్వరావు స్పష్టం చేస్తున్నారు. అమ్మాజీకి ఎస్సి కార్పొరేషన్ పదవి ఇచ్చారు కాబట్టి నియోజవర్గంలో ప్రోటోకాల్ ఉంటుందని అన్నారు.
అంతేకాదు తనను పార్టీ పక్కనపెట్టిందని వస్తున్న ఆరోపణలు కూడా ఖండించారు. పార్టీలో ఎప్పటికీ తనకు తగిన ప్రాధాన్యతను ఉంటుందని చెప్పారు. వైసీపీ అధిష్టానానికి తానేంటో తెలుసని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రిగ్గింగుకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. కాగా జనసేన ఏకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవల వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అదే క్రమంలో జనసేన అధినేత వైఖరిలో మార్పు రావాలని రాపాక సూచిస్తున్నారు. దీనిపై జనసేన కూడా సీరియస్ అయింది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.