ఏపీలో బియ్యం డోర్ డెలివరీ.. సోమవారం మొబైల్ యూనిట్ల ట్రయల్ రన్
గ్రామ, వార్డు సచివాలయాలతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పలు సేవలు అందిస్తున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయాలతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పలు సేవలు అందిస్తున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.
ఈ నేపధ్యంలో సోమవారం మొబైల్ యూనిట్ల ట్రయల్ రన్ చేయనున్నారు. మొబైల్ యూనిట్ల ద్వారా ఇంటికి వెళ్లి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తారు. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ఓపెన్ చేసి రేషన్ ఇస్తారు. ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను ముందే ఇవ్వనున్నారు.
సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 8న ట్రయల్ రన్ వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 13,370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని చెప్పారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ విధానం అమలు చేసింది.