రాజధాని విషయంలో ఎంపీ కేశినేని వ్యాఖ్యలకు పీవీపీ కౌంటర్
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉంటే ఏపీకి కూడా కావాలని అనడం తప్పు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉంటే ఏపీకి కూడా కావాలని అనడం తప్పు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో జనాభా, దాని భౌగోళిక స్వరూపం దృష్ట్యా అక్కడ మూడు రాజధానులు ఉన్నాయని నాని అన్నారు. అయితే కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కౌంటర్ ఇచ్చారు. 'దక్షిణాఫ్రికా వైశాల్యం 12 లక్షల చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ అంతటా కలిపితే ఒక లక్షా 60 వేల చదరపు కిలోమీటర్లు.. అంటే దక్షిణాఫ్రికాలో 1/8 వ వంతు. ఇక జనాభా పరంగా చూసుకుంటే ఇంచుమించు రెండూ ఒకటే. అంత పెద్ద దేశానికీ లాజిస్టిక్ సమస్య ఉంది. కానీ మన రాష్ట్రానికి దట్టమైన జనాభా ఉంది. లాజిస్టిక్ అనేది పెద్ద సమస్య కాదు.. పంపిణి చేయడమే లక్ష్యం' అని అన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరం అవొచ్చేమో.. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. రాజధానిపై ప్రతిష్టాత్మక సంస్థలతో వేసిన కమిటీ నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.