అమరావతి ఉద్యమకారులకు పోలీసుల నోటీసులు
రాజధాని అమరావతి కోసం రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే..
రాజధాని అమరావతి కోసం రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ వ్యాధి ఉన్నా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందుకు వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న 11 గంటలకు వెంకటపాలెలంలో యూనియన్ బ్యాంక్ సమీపంలో ఇళ్లలో జై అమరావతి జిందాబాద్ అంటూ సుమారు 12 నుంచి 15మంది నినాదాలు చేయడం, లాక్డౌన్ సమయంలో బయట తిరగడం, కలవడం జరిగిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇక పోలీసులు తమ నోటీసులో 12 నుంచి 15 మంది ఉద్యమం చేస్తున్నారని, లాక్డౌన్ సమయంలో వీరు బయట తిరగడం, కలవడం జరిగిందని నోటీసులో పేర్కొన్నారు. అయితే జిల్లాలో సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున.. సెక్షన్ 188, 269, 270, 271 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం అంటూ మహిళా రైతులకు, రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో కారణాలు తెలియజేయవలసిందిగా నోటీసు ద్వారా మీకు తెలియజేయడమైనది' అని పోలీసులు తెలియజేశారు.. నోటీసులు అందుకున్న రైతులు పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరణ ఇవ్వాలని సూచించారు.