Petrol Price in AP: పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు.. రోడ్ సెస్ కింద రూపాయి పెంచుతూ నిర్ణయం

Petrol Price in AP | ఒక పక్క కేంద్రం, మరో పక్క రాష్ట్రాలు పెట్రోలు ధరలను మూకుమ్మడిగా పెంచుకుంటూ పోతున్నారు.

Update: 2020-09-19 02:54 GMT

Petrol Price in AP | ఒక పక్క కేంద్రం, మరో పక్క రాష్ట్రాలు పెట్రోలు ధరలను మూకుమ్మడిగా పెంచుకుంటూ పోతున్నారు. లాక్ డౌన్ ముందు సుమారుగా రూ. 74 లు ఉండే లీటరు పెట్రోల్ ధర. ఇప్పుడు ఏకంగా రూ. 87 వరకు పెరిగింది. ఇటీవల కాలంలో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, కొంతమంది బస్సులు, రైళ్లో ప్రయాణించేందుకు భయడపడటం వల్ల వీలైనంత వరకు మోటారు సైకిళ్లమీదే ప్రయాణం చేస్తున్నారు. దీంతో పాటు వీలైనంత మంది తమ స్వంత కార్లు, అద్దె కార్లలోనే దూర ప్రయాణాలు చేస్తున్నారు. దీనివల్ల ఇటీవల కాలంలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలు మందగించినా, పెట్రోల్, డీజిల్ మాత్రం నిత్యావసర సరుకుల్లా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క కేంద్రం, మరో పక్క రాష్ట్రాలు పెట్రోల్ పై ధరలు పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం రోడ్ సెస్ పేరుతో రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో విక్రయించే పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలపై రహదారుల అభివృద్ధి సెస్‌ను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై రూపాయి సెస్‌ను విధిస్తూ ఏపీ వ్యాట్‌ చట్టం–2005కు సవరణ చేశారు. కోవిడ్‌ ఉపద్రవంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని, లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ (వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనలో ఇంకా ఏముందంటే..

► గతేడాది ఏప్రిల్‌ నెల ఆదాయం రూ.4,480 కోట్లుండగా, లాక్‌డౌన్‌తో ఈ ఏడాది రూ.1,323 కోట్లకే పరిమితమైంది.

► కేంద్రం కూడా 2020–21 ఏడాదికి జీఎస్టీ పరిహారాన్ని కూడా చెల్లించడం లేదు.

► కోవిడ్‌–19 కట్టడికి ఆరోగ్యరంగంపై అధికంగా వ్యయం చేయడంతో పాటు, కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో రాబడి కంటే వ్యయం ఎక్కువైంది.

► వీటిని పరిగణనలోకి తీసుకున్నాక రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెస్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

► దీని ద్వారా వచ్చే సుమారు రూ.500 కోట్లను ప్రత్యేకంగా రహదారుల అభివృద్ధి కోసం ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బదలాయిస్తాం.    

Tags:    

Similar News