లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై సెక్షన్ 158 కింద కేసులు : పేర్ని నాని
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. అయితే ప్రజలు అవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే దీనిపైన ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఒకవేళ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే సెక్షన్ 158 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సెక్షన్ల కింద 330 కేసులు, 256 వాహనాలు సీజ్ చేశామని వెల్లడించారు. కరోనాని కట్టడి చేసేందుకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. దీనిపైన ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు త్వరలో కరపత్రాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఏ ఒక్కరూ బయటకు రాకుండా నిషేధం విధించామని, బయటకు వస్తే శిక్షలు తప్పవని వెల్లడించారు. ఇక కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలుంటే 104 కు ఫోన్ చేయాలని.. అత్యవసర సేవలు 24 గంటలూ కొనసాగుతాయని తెలిపారు. ఇక నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యల తప్పవని వెల్లడించారు. ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేస్తామని, రేషన్ కార్డుకు రూ.వెయ్యి ఈ నెల 29న రేషన్ అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక పదో తరగతి పరీక్షల వాయిదాపై మంత్రి స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పరీక్షలను వాయిదా వేశామన్నారు. నెల 31 తర్వాత కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామన్నారు.