ఉగాది నుంచి గ్రామీణప్రాంతాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని, ఇల్లాలి పేరుతో రిజిస్ట్రేషన్ జరుగుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రెండో ఏడాది నుంచి 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో ఇళ్లులేని అర్హులైన పేదలకు ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కొని ఆ ఇంట్లోని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉగాది రోజున అందజేస్తామని తెలిపారు. జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలవుతుందని, తల్లుకు 15 వేల చెక్కులు అందజేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. జులై 1 నుంచి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తెలిపిందని, కార్యాచరణకు కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్ని నాని చెప్పారు.