ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాము అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న దృఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం నడుస్తుందని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బీజేపీతో పొత్తు స్థానిక ఎన్నకల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుందని పవన్ చెప్పారు. ఏపీలో అవినీతి రహిత సుస్థిర పాలన అందించే లక్ష్యంతో పనిచేస్తామని పవన్ స్పష్టం చేశారు. బీజేపీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, దాన్ని సరిచేసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వామపక్షాల కంటే ముందే తాను బీజేపీతో కలిసి పనిచేశానని, వామపక్షాలకు తానేమీ బాకీలేనని ప్రకటించారు.