జర జాగ్రత్త అంటూ బొత్సకు పవన్ వార్నింగ్

Update: 2019-08-31 14:18 GMT

అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ వెళ్లదని పవన్‌ కల్యాణ్‌ రైతులకు భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశమైన పవన్‌ వారి గోడును విన్నారు. రైతులు భూములిచ్చింది వ్యక్తులకు కాదని ప్రభుత్వానికి అన్న పవన్‌ రాజధాని అంటే పిల్లల ఆట కాదని స్పష్టం చేశారు. భూమిలిచ్చిన ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని జనసేనాని తేల్చిచెప్పారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులతో సమావేశమయ్యారు. అమరావతి రాజధాని విషయంలో మంత్రుల ప్రకటనలతో గందరగోళంలో పడ్డామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రస్తుతం అమరావతిలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని తామంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాజధాని రైతులకు పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతి నుంచి అడుగు కూడా కదలదని అందుకు తాను హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరావతికి కేంద్రం 1500 కోట్లు ఇచ్చిందని ఒకవేళ రాజధానిని మార్చుతామంటే అది మోడీ, అమిత్ షాలను వ్యతిరేకించడమే అని అన్నారు. అంతవరకు వస్తే ప్రధాని, హోంమంత్రిని కలుస్తానని పవన్‌ స్పష్టం చేశారు. 150 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

చెడు వార్తలకు బాద్యులు కావొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బొత్స అనుకున్నా అప్పట్లో జరగలేదని ఏమో భవిష్యత్‌లో అది జరగొచ్చేమో అని వ్యంగంగా అన్నారు. ఇసుక అక్రమాల వల్లే గత ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఇసుకతో ఆటలాడుకుంటుందని పవన్‌ ఆరోపించారు. భూమిని కాని భూమిని నమ్ముకున్న వారిని కానీ మోసం చేయొద్దని హితవు పలికారు. కులం రంగు పులిమి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని పవన్‌ తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి రైతులను లాగొద్దన్న పవన్‌ వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని స్పష్టం చేశారు.  

Full View

Tags:    

Similar News