షాద్నగర్లో వెటర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కొందరంటుంటే, వారిని బహిరంగంగా ఉరి తీయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. అటువంటి ఘటనలకు పాల్పడే వారిని బెత్తంతో కొట్టాలని సూచించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. 'వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. అలాగే ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు.
అసలు అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆమెకు ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు కొట్టాలి, ఎలా కొట్టాలంటే చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి.. అంతేకాని నడిరోడ్డున ఉరి తీయాలని అంటున్నారు. ఒక మణినిషిని చంపే హక్కు మనకు లేదు.. సమాజం అర్ధం చేసుకోవాలి.. కానీ ఒక మణినిషిని శిక్షించకపోతే ఎలా? శిక్షా ధర్మం ముఖ్యం' అని పవన్ పేర్కొన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ప్రాణం తీసిన మృగాళ్లను బెత్తం దెబ్బలతో సరిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.