అధికార పక్షాన్ని గుడ్డిగా వ్యతిరేకించమని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాకు చెప్పలేదు.. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను సమర్థించమనే చెప్పారు అన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి మంచిపనినీ సమర్థిస్తాం అధ్యక్షా అంటూ అయన మాట్లాడారు.
'''అధ్యక్షా.. నేను జనసేన తరఫున మాట్లాడుతున్నా అధ్యక్షా. అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కల్యాణ్ చెప్పలేదు అధ్యక్షా. ఏపీ ప్రభుత్వం అటు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చూసుకుంటూ అన్నివర్గాలకు సమదృష్టితో చూస్తూ ఈ బడ్జెట్ ను రూపొందించింది. అలాగే సుమారు రూ.28,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారుచేశారు అధ్యక్షా. తండ్రి వైఎస్ తరహాలో ఆయన కుమారుడు, సీఎం జగన్ రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చింది'' అని రాపాక బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు.