ఉల్లి ధరలపై భగ్గుమన్న పవన్ కళ్యాణ్

Update: 2019-12-04 02:05 GMT

భారీ వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశాన్నంటాయి. గత రెండు నెలలుగా ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధరలు పెరగడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఉల్లి సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో నిందిస్తోందని.. ఇది సరైంది కాదని ఆయన హితవు పలికారు. ఈ రకమైన నిందలు మొదలుపెడితే బ్రిటిష్ ప్రభుత్వాల వరకు వెళ్ళవచ్చని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకాకుంటే రద్దు చేసి ఎన్నికలు జరపాలని అన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి రైతు బజార్‌ను సందర్శించారు ఆయన. తిరుపతిలో ఉల్లి అమ్మకందారులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా సబ్సిడీ ఉల్లిపాయల పంపిణీ జరగడంలేదని, అవి ఎప్పుడు లభిస్తాయో ప్రజలకు తెలియడం లేదని అన్నారు.

ఉల్లి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతి సమస్య నుండి తప్పించుకుంటున్నారని, ఒక గృహిణి జ్యోతి పవన్‌తో మాట్లాడుతూ, "జగన్ తమ సమస్యలను పరిష్కరించడానికి వచ్చారని ప్రజలు భావించారు. ఇంతవరకు ఆయన ఏమి చేశారు? పప్పుధాన్యాలు, పామోలిన్ మరియు కూరగాయలు మొదలైన ధరలు ఆకాశాన్నంటాయి. రైతు బజార్‌లో అన్ని కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. గతంలో రూ.500 కు మేము కూరగాయలతో నిండిన సంచిని తీసుకుంటాము, అయితే ఇప్పుడు రూ.1000 పెట్టినా కూడా సంచి నిండటం లేదని పవన్ కు తెలిపారు. పవన్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలు కొంతకాలం ఇసుక దొరక్క బాధలు పడ్డారని, ఇప్పుడు ఉల్లిపాయలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని.. ప్రజలు అధిక ధరలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు, వినియోగదారులు కాకుండా మధ్యవర్తులు భారీగా ప్రయోజనం పొందుతున్నారని కిలో ఉల్లిపాయలు 100 రూపాయలకు సరైనది కాదన్నారు. 

Tags:    

Similar News