Tirupati By Poll: కొనసాగుతున్న తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక పోలింగ్‌

Tirupati By Poll: పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు

Update: 2021-04-17 04:01 GMT

ఓటు వేయడానికి లైన్లో నిలుచున్న ప్రజలు (ఫైల్ ఇమేజ్)

Tirupati By Poll: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. క్యూలైన్‌లో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర శానిటైజర్, మాస్క్‌లు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. ఓటర్లు మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 7గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

తిరుపతి లోక్‌సభ పరిధిలో 17 లక్షల 10 వేల 699 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషుల ఓట్లు 8 లక్షల 38 వేల 540 మహిళలు 8 లక్షల 71 వేల 943 మంది ఉన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, చిత్తూరు జిల్లాలో మూడున్నాయి.

మొత్తం 2వేల 470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 339 సెంటర్లు, గూడూరు 366, సూళ్లూరుపేట 343, వెంకటగిరి 366, తిరుపతి 382, శ్రీకాళహస్తి 362, సత్యవేడు 312 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 877 పోలింగ్ సెంటర్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. ఎక్కువమంది ఓటర్లున్న కేంద్రాలను రెండుగా విభజించామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరా థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజేషన్‌ కోసం ప్రత్యేక సిబ్బంది వుంటారని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేశామన్నారు.

ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మొత్తం 28 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నోటా గుర్తుతో పాటు మొత్తం 29 సింబల్స్‌తో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షించేందుకు 288 మంది సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం.

Tags:    

Similar News