ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు
ఐపీఎస్ ఆఫీసర్ అమ్మిరెడ్డికి రాష్ట్ర శాసన మండలి ఈరోజు నోటీసులు పంపింది.
అమరావతి: ఐపీఎస్ ఆఫీసర్ అమ్మిరెడ్డికి రాష్ట్ర శాసన మండలి ఈరోజు నోటీసులు పంపింది. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో ఆయన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ చేశారనే కారణంతో ఈ నోటీసులు ఇచ్చారు.
శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. అదే సమావేశంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి హాజరు కావాలని నోటీసులో ప్రివిలేజేస్ కమిటీ పేర్కొంది. కమిటీ ముందు అమ్మిరెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, గుంటూరు అర్బన్ ఎస్పీల మధ్య 2020లో ట్విట్టర్ వార్ జరింది. పొన్నూరు ఎమ్మెల్యేను ఉద్దేశించి టీడీపీ కార్యకర్త మణిరత్నం పెట్టిన పోస్టుకు అతన్ని అక్రమంగా అరెస్టు చేశారని, జగన్ పిరికి తనాన్ని బయటపెట్టిందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మణిరత్నం పెట్టిన పోస్టులో తప్పేంటో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొందమంది పోలీసులు.... ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి ఉండదని హితవు పలికారు. కష్టాలు కొనితెచ్చుకుంటారని హెచ్చరించారు.
అయితే, లోకేష్ పెట్టిన ట్వీట్కు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పందించారు. అసత్యాలు ప్రచారం చేస్తే లోకేష్పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ ట్వీట్టర్లో పోస్టు చేశారు. లోకేష్ ట్వీట్లు కలహాలు ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఎస్పీ ట్వీట్పై స్పందిస్తూ లోకేష్ మరోట్వీట్ పోస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీకి దమ్ము, ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ ఫుటేజ్ బయట పెట్టాలని సవాల్ విసిరారు. టీడీపీ కార్యకర్త మణిరత్నం పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన ఫొటోను ట్యాగ్ చేశారు. రాజకీయ ఉన్నతాధికారులకు పోలీసులు లొంగిపోవడం మానుకోవాలంటూ లోకేష్ అమ్మిరెడ్డికి ట్వీట్ చేశారు.