సీఎం వైఎస్‌ జగన్‌కు నితీష్‌ కుమార్‌ ఫోన్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు..

Update: 2020-09-11 03:39 GMT

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సహకరించాలని జగన్ ను కోరారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కి మద్దతు ఇవ్వాలని నితీష్‌ సీఎం జగన్‌ను ఫోన్‌ లో కోరారు. కాగా 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగిసింది.. దాంతో హరివంశ్‌ మరోసారి పోటీలో నిలిచారు. ప్రస్తుతం ఇటీవల ఎన్నికైన సభ్యులతో కలిపి రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే వైసీపీకి ఆరుగురు, బీజేపీకి నలుగురు, టీడీపీకి ఒక సభ్యుని బలం ఉంది.

సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇదిలావుంటే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలనీ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గురువారం ఒడిశా ముఖ్యంనంత్రి నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసిన నితీష్‌ కుమార్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో సహకరించాలని కోరారు. ఆయన పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేడు తన అభ్యర్థిని ప్రకటించనుంది. మొత్తం 245 సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకు 114 సభ్యల మద్దతుంది. యూపీఏకు 104 మంది ఉన్నారు.

Tags:    

Similar News