విజయవాడ, గుంటూరులకు మహర్దశ పట్టనుంది. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీవో) అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు విజయవాడ, గుంటూరు ఎంపికయ్యాయి. యూఎన్ఐడీవో కు మొత్తం ఐదు నగరాలను ఎంపిక చేస్తే అందులో రెండు ఏపీనుంచే ఉండటం విశేషం.గుంటూరు, విజయవాడ తోపాటు రాజస్థాన్లోని జైపూర్, మధ్యప్రదేశ్లోని భోపాల్, కర్ణాటకలోని మైసూరులను కూడా పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేశారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూఎన్ హ్యాబిటాట్,
జీఈఎఫ్ (గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ) సంస్థల భాగస్వామ్యంతో యూఎన్ఐడీవో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రవాణా నెట్వర్క్ అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. ఇందుకోసం కేంద్రం గ్రాంటును అందించనుంది. యూఎన్ఐడీవో ప్రతినిధి బృంద రెండు రోజులుగా విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తోంది.