గ్యాస్ లీకేజ్ ఘటనపై నివేదిక ఇచ్చిన ఎన్జీటీ విచారణ కమిటీ
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ ఘటనపై నివేదిక సమర్పించిన ఎన్జీటీ విచారణ కమిటీ మానవ తప్పిదాలతోనే ప్రమాదం జరిగిందని నివేదికలో వెల్లడించింది. నివేదికలో ఐదు కీలక తప్పిదాలను ఎత్తిచూపింది ఎన్జీటీ విచారణ కమిటీ..
ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ.. రిటైర్డ్ జడ్జ్ శేష శయన రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నివేదిక సమర్పించింది. ఇందులో స్టైరిన్ పాలిమరైజేషన్ను నిలువరించే టీబీసీ తగినంతగా స్టోరేజ్ ప్లాంట్లో అందుబాటులో లేదని.. ప్లాంట్లో ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయలేదని తెలిపింది కమిటీ. ట్యాంక్ టాప్ లేయర్స్లో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించలేదంది. వీటితో పాటు ప్లాంట్లో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ను 24 గంటల పాటు నిర్వహించటం లేదని.. స్టోరేజ్ ట్యాంకుల దగ్గర పర్సన్ ఇంఛార్జ్ల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని నివేదికలో వెల్లడించింది.
కమిటీ నివేదికపై ఒక్కరోజులో అభ్యంతరాలు తెలపాలని ఎల్జీ పాలిమర్స్కు ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అయితే గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించే అధికారం ఎన్జీటీకి లేదని వాదించారు ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర. 2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని ఈఏఎస్ శర్మ తరపు న్యాయవాది వాదించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుమోటోగా కేసు విచారణ వద్దంటున్న నేపధ్యంలో తన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వాలని కోరారు.