ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాబార్డు శుభవార్త అందించింది. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్కు రుణాన్ని మంజూరు చేసింది. ఇందుకుగాను రూ.1931 కోట్ల మేర రుణం మంజూరు చేస్తూ నాబార్డు నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు నాబార్డు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వినియోగించనుంది. గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 33 మండలాల్లో 410 గ్రామాలకు సాగునీరు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టింది. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు గోదావరి వరద జలాలను 3దశల్లో మళ్లించేందుకు ప్రాజెక్టు నిర్మించనున్నారు. 2022 మార్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 53.5 టీఎంసీల నీటిని పశ్చిమ గోదావరి, పశ్చిమ కృష్ణాలోని ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. కాగా.. 4.8 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సీజన్లో నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.