Coronavirus: ఎలా వచ్చింది.. ఆ జిల్లాలో వీడని మూడు కరోనా కేసుల మిస్టరీ
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్క రోజే 17 నమోదయ్యాయి. గుంటూరు నగరంలోనే 16 కేసులు కాగా,.. ఒకటి దాచేపల్లికి చెందినదిగా గుర్తించారు. అయితే జిల్లాలో వెలుగు చూసిన కేసుల్లో మూడు కేసులు మిష్టరీగా మారిపోయాయి. ఇప్పటి వరకు వెలుగు చూసిన కేసులు అన్ని ఢిల్లీ లింకులు ఉన్నవి, ఒక కేసు విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా వచ్చింది.
అయితే పల్నాడులో వెలుగు చూసిన రెండు కరోనా కేసులు, పొన్నూరులో ఒక కేసు మాత్రం అధికారులకు అంతుచిక్కడంలేదు. వీరికి కరోనా ఎలా సోకింది అనేది ఇంకా తేలలేదు. ఈ మూడు కేసులు అధికార యంత్రాంగాన్నే కాదు, జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్నాయి. బాధితులు నివాసముండే ప్రాంతంలో కరోనా ఎవరికి ఉండవచ్ఛు? ఇంకా ఎంతమందికి వైరస్ వ్యాపించి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
గుంటూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అయితే మృతులు గాని, వారి కుంటుంబంలోని వారు గాని ఎవరూ ఢిల్లీ వెళ్లలేదు. విదేశాల నుంచి వచ్చినవారు వీరి ఇళ్లల్లో ఎవరూ లేరు. కరోనా సోకిందనేది ఎలా సోకిందనే దానిపై అధికారులు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. పొన్నూరులో మరొకరికి కరోనా ఎలా సోకింది అనేది ఇంకా తేలలేదు.
రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధికంగా కేసులు గుంటూరుజిల్లాలోనే నమోదైయ్యాయి. ఢిల్లీ, విదేశీ పర్యటనలతో సంబంధం లేనివారికి కరోనా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు కేసులు ఎలా సంక్రమించింది అనే కోణంలో అధికార యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది.
పల్నాడులో మరణించిన వారిలో నరసరావుపేట వ్యక్తి స్థానిక కేబుల్ ఆపరేటరు వద్ద బిల్లు కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఇంటింటా తిరుగుతూ.. బిల్లులు వసూలు చేస్తుంటాడు. ఆ ప్రాంతంలోఇంకా ఎవరికైనా వ్యాప్తించిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. దాచేపల్లిలోని నారాయణపురానికి చెందిన మరోకరు స్థానికంగా ఎలక్ట్రీషీయన్గా పని చేసేవాడు. పొన్నూరులోని ఓ వ్యక్తికి కరోనా ఎలా సోకిందనే విషయంమై తేల్చేపనిలో వైద్యాధికారులు నిమగ్నమైయ్యారు.