ఎంపీడీవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రజిని

Update: 2019-10-31 04:50 GMT

అవినీతిని ప్రోత్సహిస్తారా అంటూ చిలకలూరిపేట ఎంపీడీవో పి.శ్రీనివాస పద్మాకర్‌పై ఎమ్మెల్యే విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అక్రమంగా బిల్లులు పెట్టించి అవసరానికి మించి ప్రభుత్వం నుంచి నిధులను డ్రా చేసుకుంటున్నారని చిలకలూరిపేట ఎంపీడీవోపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే రజిని మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని రికార్డులు పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులను పిలిచి మాట్లాడారు. ఈ సందర్బంగా ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నారు కార్యదర్శులు. పంచాయతీల నుంచి అవసరం లేకున్నా అక్రమంగా నిధులు డ్రా చేసి తనకు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీడీవోపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు కార్యదర్శులు.

నెలరోజులనుంచి తమ వద్ద నుంచి రూ.1.8 లక్షలు అక్రమంగా వసూలు చేశారని.. పనికోసం వచ్చే ప్రజలు సైతం డబ్బులు చెల్లించనిది పని జరగదని వారు ఆరోపించారు. ఓ కాంట్రాక్టర్‌ కూడా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.. రూ.2 లక్షలు విలువైన పనులకు రూ. 5లక్షలకు బిల్లు పెట్టాలని తనకు ఎంపీడీవో చెప్పారని ఆయన ఆరోపించారు. బిల్లు అయ్యాక మిగిలిన రూ.3 లక్షలు తనకు తెచ్చి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవోను పిలిచి మాట్లాడారు రజిని.. ప్రభుత్వం ఓ వైపు అవినీతి రహిత పాలనను అందించాలని కంకణం కట్టుకుంటే, మీరు అక్రమ వసూళ్లకు పాల్పడతారా? అంటూ ఎంపీడీవో పి.శ్రీనివాస పద్మాకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎంపీడీవోపై జెడ్పీ సీఈవో డి.చైతన్యకు ఫిర్యాదు చేశారు రజని. 

Tags:    

Similar News