జగన్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే కుమారులు

టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.. జగన్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే కుమారులు.. వైసీపీలో చేరారు గత కొంత కాలంగా టీడీపీ అధిష్టానం వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్న..

Update: 2020-09-19 10:55 GMT

విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ జగన్ కు జై కొట్టారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే వాసుపల్లి.. అప్పటినుంచి టీడీపీతో అంటీముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే గతనెలలో ఈ ప్రచారాన్ని ఖండించారు వాసుపల్లి.. కానీ నెల తిరగకుండానే ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

శనివారం క్యాంప్‌ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు, విశాఖ వైసీపీ ఇంచార్జి విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు జగన్ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్యే వాసుపల్లి రాకను ప్రస్తుత దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ద్రోణంరాజు శ్రీనివాసరాజు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయనను బుజ్జగించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం.  

Tags:    

Similar News