'మగధీర'లా చంద్రబాబు... చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా

Update: 2019-12-12 07:27 GMT
రోజా

టీడీపీ సభ్యుల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మహిళా సభ్యులన్న గౌరవం లేకుండా గతంలో టీడీపీ సభ్యులు వ్యవహరించలేదా అని ప్రశ్నించారు. సభా సంప్రదాయాల గురించి టీడీపీ సభ్యులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తొలి సారి ఎమ్మెల్యే అయిన తనను నిబంధనలకు విరుద్ధంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

సుప్రీంకోర్టు నుంచి తాను మధ్యంతర ఉత్తర్వులను తెచ్చుకున్నప్పటికీ సభలో అడుగుపెట్టకుండా తనను మార్షల్స్‌తో అడ్డుకున్నారని చెప్పారు. గత అసెంబ్లీ వీడియోలు బయటపెడితే తమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో స్పష్టమవుతుందని తెలిపారు. ఈ రోజు చంద్రబాబు గట్టిగట్టిగా అరుస్తున్నారని, గట్టిగా అరిచినంతమాత్రాన గడ్డిపరక గర్జించలేదని పేర్కొన్నారు. గతంలో నిండు సభలో మీ అందరినీ పాతిపెడతానని బోండ ఉమా ఆనాడు అన్నారని, అప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. మగధీర సినిమా డైలాగ్‌ల తరహాలో 150మంది రండీ ఒకేసారి సమాధానం చెప్తానని చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని, వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆయనకు చాదాస్తం ఎక్కువవుతోందని దుయ్యబట్టారు.

Tags:    

Similar News