అవినీతి కంపులో అమరావతి నిర్మాణం

Update: 2019-06-26 15:02 GMT

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం అవినీతి కూపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ సుమారు 3 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం వ్యవహారంలో అన్ని అంశాలపైనా సీఎం జగన్‌ సమీక్షించారని.. ఏ అంశాన్ని చూసినా పెద్ద కుంభకోణం కనిపిస్తోందని ఆయన చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌, నిర్మాణాలు, భూ కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. బలవంతపు భూసేకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని బొత్స చెప్పారు. కుంభకోణం వివరాలు తేలాక రాజధాని అభివృద్ధి సంగతి చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని.. రూ.100తో అయ్యే పనికి రూ.150 ఖర్చు చేశారన్నారు. తమకు కావాల్సిన వాళ్లకు అనుకూలంగా.. పేదలకు మాత్రం ఇష్టారాజ్యంగా ప్లాట్లు కేటాయించారని చెప్పారు. ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైందని.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. రైతులు, ప్రభుత్వం, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని, ఆ విధంగా ప్రభుత్వానికి మంచిపేరు వచ్చే విధంగా, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్లు సంతృప్తి కలిగేలా చూడాలని సీఎం నిర్దేశించారని బొత్సా చెప్పారు.  

Tags:    

Similar News