విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది.. మరికాసేపట్లో స్నేహితులతో కలిసి ప్రకృతిని ఆస్వాదించాల్సిన యువతి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. విశాఖ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన మల్కాపురం పోలీస్స్టేషన్ పరిధిలోని మారుతి సర్కిల్ వద్ద జరిగింది. విశాఖపట్టణం 46వ వార్డు శ్రీహరిపురం, శ్రీనివాస్నగర్ ప్రాంతానికి చెందిన మొగిలిపురి రవికుమార్ చౌదరి..ఇతనికి ఇద్దరు సంతానం. శ్రీవిద్య పెద్ద కుమార్తె. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం తోటి విద్యార్థులు అంతా కలిసి లంబసింగి వెళ్లాలనుకున్నారు. అందుకోసం తెల్లవారుజామున తోటి విద్యార్థి లావేటి సంతోష్ తో కలిసి శ్రీదివ్య... కేజీహెచ్ నుంచి ద్విచక్రవాహనంపై ముందుగా గాజువాక వెళ్లి..
అక్కడ నుంచి స్నేహితులంతా కలిసి లంబసింగి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అన్నట్టుగానే తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై సంతోష్, శ్రీవిద్య బయలుదేరారు. అయితే ద్విచక్రవాహనం మారుతి సర్కిల్ దగ్గరకు రాగానే అదుపుతప్పి పడిపోయింది. దాంతో ఇద్దరు కిందపడ్డారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు వెనకాలే వస్తున్న లారీ శ్రీవిద్య తల పైనుంచి వెళ్ళింది. దీంతో తీవ్ర గాయాలతో శ్రీవిద్య అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో తోటి మిత్రులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.