ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోకి మంగళగిరి నియోజకవర్గం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నుంచే స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పోటీ చేసేసరికి అందరి కళ్లు ఇప్పుడు ఈ నియోజకవర్గంపై పడ్డాయి. సర్వేలు కూడా ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదో తేల్చలేకపోతున్నాయి. అంత సస్పెన్స్ గా పరిస్థితి ఉంది మంగళగిరిలో. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ - వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. జనసేన మద్దతులో సీపీఐ అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు బరిలోకి దిగారు. పొత్తుల్లో భాగంగా మంగళగిరి సీటు సీపీఐకి ఇచ్చింది జనసేన. ఇక్కడ నుంచి సీపీఐ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ముప్పాళ్లకు ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఆసక్తికర విషయమే. పోటీలో ఎంతమంది ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం ఆర్కే నారా లోకేష్ మధ్యే కనబడుతోంది.
అంతేకాదు అత్యంత సామాన్యుడిగా.. పొలం పనులు చేసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. సదావర్తి, రాజధాని భూముల కేసులో టీడీపీకి చుక్కలు చూపించారు ఆర్కే. దీంతో.. ఆర్కే ఇమేజ్ మంగళగిరిలో బాగా పెరిగింది. మరోవైపు.. కాజ - పెనుమాక లాంటి గ్రామాల్లో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా చేనేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అదే సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆయన టీడీపీలో ఉండటం లోకేష్ కు కలిసి వచ్చే అంశం కాగా.. టీడీపీలోని కొందరు నేతలతోపాటు చేనేత సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మరి మంగళగిరిలో గెలుపెవరిదో మీరు పోల్ ద్వారా తెలియజేయవచ్చు.