ఇవాళ ఉదయం 10.30 గంటలకు టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇకపై ఇక్కడినుంచే పార్టీ కార్యకలాపాలు సాగనున్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇకనుంచి తెలంగాణకే పరిమితం కానుంది. ఏపీ కార్యాలయానికి కూడాఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని నామకరణం చేశారు. ఇందులో మూడు బ్లాక్ల నిర్మాణానికి గాను మొదటి బ్లాక్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన రెండు బ్లాకులకు నిర్మాణం పూర్తికాలేదు. మొత్తం 75వేల అడుగులతో జీప్లస్-3గా మొదటి బ్లాక్ నిర్మాణం ఉంది.
మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేష్ ఛాంబర్స్ ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా మరియు రాష్ట్ర అధ్యక్షుడికి ఛాంబర్ రూమ్లు కేటాయించారు. ఇదిలావుంటే గురువారం రాత్రి నూతన భవనంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ చేశారు. అనంతరం సుదర్శన హోమం, గణపతి హోమం నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని దంపతులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నారా దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు.