కియా మోటార్స్ తరలింపుపై ఎండీ కీలక ప్రకటన
సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది.
సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. కియా మోటార్స్ అనంతపురంలోనే కొనసాగిస్తామని కంపెనీ ఎండీ స్పష్టం చేశారు. అనంతపురంలోని ఫ్యాక్టరీ నుంచే కియా మోటార్ వాహనాలు తయారు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కియా మోటార్స్ కంపెనీ ప్రతినిధి ఎండీ సందేశాన్ని చదివి వినిపించారు.
ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. కీయా మోటార్స్ విషయంలో గత కొంతకాలంగా వస్తు్న్న వార్తల్లో నిజం లేదని కియా ప్రతినిధి వెల్లడించారు. భారతీయ మార్కెట్పై దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో కీయా మోటార్స్ కంపెనీని నెలకొల్పినట్లు చెప్పారు. కంపెనీని అనంతపురం నుంచి ఎక్కడికి తరలించాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
రాయిటర్స్ వార్తా సంస్థ కీయా తమిళనాడుకు తరలిపోతుందని ప్రాథమికంగా చర్చలు ప్రారంభమయ్యాయని కథనాన్ని ప్రచురించింది. దీనిపై రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. దీంతో ఈ కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ ఖండించగా, తాజాగా కియా మోటర్స్ ఎండీ కూడా స్పష్టం చేశారు.
అలాగే దీనిపై కియా మోటార్స్ సంస్థ ప్రతినిధి మనోహర్ భగత్ స్పందించినట్లు తెలుస్తోంది. దేశంలో తమ కంపెనీని విస్తరించాలనే చూస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి తమ ప్లాంట్ను తరలించాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది. కియా మోటార్స్ యాజమాన్యంతో సంప్రదించలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి ఏపీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవకు ఫోన్ ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది.