టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనను నిన్న పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో పంపించేశారు. నిన్నటి విశాఖ పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తానని మండిపడ్డారు.
విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్నానానికి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎలా విమానాశ్రయానికి రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల సాయంతోననే వైసీపీ నిరసనలు అనేది స్పష్టం అయిందని అభిప్రాయపడ్డారు.