ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో రాత్రి నుంచే టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను గృహనిర్బంధం చేశారు.
ఇటు చంద్రబాబును కలిసేందుకు పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ చంద్రబాబు నివాసం దగ్గర ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు గుంటూరులోని వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని కూడా పోలీసులు దిగ్బంధం చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇటు అక్కడికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.