Andhra Pradesh: ఏపీలో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సూరీడు...

Andhra Pradesh: రోహిణి కార్తె ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2021-05-27 03:31 GMT

High Temperatures in AP:(File Image)

Andhra Pradesh: ఒక పక్క కరోనా కరాళనృత్యం, మరో వైపు ఎండలు ఇలా ప్రజల్ని గుక్కదిప్పుకోనీయకుండా చేస్తోంది. అస్సలే ఎండా కాలం.. అందునా రోహిణి కార్తె ఇంకే ముంది సూర్యుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కోస్తాంధ్రలో వడగాల్పుల ప్రభావమూ అధికమైంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా వడగాడ్పుల ప్రభావాన్ని తట్టుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూాడా సూచించింది.

బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 42.2, అమరావతి, బాపట్ల, నందిగామలో 42 డిగ్రీలుగా రికార్డు అయింది. జంగమహేశ్వరపురం, విజయవాడ, మచిలీపట్నంలో 41 డిగ్రీలు, కాకినాడ, కావలి ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

యాస్‌ తుపాను ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం, ఉత్తరం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో వడగాల్పులు పెరిగాయి. విశాఖపట్నం జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 3 మండలాల్లో బుధవారం వడగాల్పులు వీచాయి.

గురు, శుక్రవారాల్లో ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని పలు మండలాలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల ప్రభావం నెలాఖరు వరకు ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరో వైపు తెలంగాణ ప్రాంతంలో కూడా విపరీతమైన వడగాల్పులతో కూడి వేడి వాతావరణం కొనసాగుతోంది.

Tags:    

Similar News