రాయలసీమలో కురుస్తున్న వర్షాలకు ఆలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లోకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన ఆలయ అధికారులు ముందుగానే దర్శనాలను రద్దు చేశారు. వరద నీరు తగ్గే వరకు భక్తులు ఆలయానికి రావొద్దని సూచించారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు పలు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రముఖ ఆలయాలు సైతం నీట మునిగాయి. పుణ్యక్షేత్రం మహానందీశ్వర ఆలయంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది.
మహానందీశ్వర క్షేత్రం జలదిగ్భందంలో చిక్కుకుంది. మూడు కోనేర్లూ నిండిపోయాయి. దీంతో నీరు ఎగువకు ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల్లోకి వరద నీరు చేరింది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం నీటిలో మునిగిపోయింది. రుద్రగుండం కోనేరులో వరద ఉద్ధృతికి పంచలింగాలూ మునిగిపోయాయి. అప్రమత్తమైన ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు పాలేరు వాగు ఉధృతితో నంద్యాల-మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తగ్గే వరకూ భక్తులు ఆలయానికి రావద్దని అధికారులు సూచించారు.