ఓ పక్క ముగ్గురు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలని అని సీరియస్గా చర్చిస్తున్నారు. మరోపక్క ఆ జిల్లా అధికారులు మాత్రం తమకే ఏమీ పట్టనట్టు స్మార్ట్ ఫోన్స్ తో గడిపారు. ఈ దృశ్యం విజయనగరం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కనిపించింది. మంత్రులు జిల్లా సమస్యలను ప్రస్తావిస్తుంటే అధికారులు మాత్రం మీటింగ్లో తమ పని తాము చేసుకుంటూ కనిపించారు.
శుక్రవారం విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమావేశం జరిగింది. జిల్లా ఇన్ చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స నారాయణ, ఎంపీలు చంద్రశేఖర్, మాధవి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రులు జిల్లాల్లోని సమస్యలు చర్చిస్తుండగా అధికారులు మొబైల్ ఫోన్స్ను చూసుకుంటూ కూర్చున్నారు.
ఒకరు న్యూస్ చూస్తుంటే మరొకరు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. మరికొందరు వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటున్నారు. ఇంకొందరు ఫోన్ మాట్లాడుకుంటూ కనిపించారు. ముఖ్యమైన విషయాలపై చర్చిస్తుంటే వేలకు వేలు జీతాలు తీసుకునే అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇలా ఉంటే ఇక ప్రజలకు సేవలు ఏం చేస్తారని అంటున్నారు.