Godavari Express Golden Jubilee: గోదావరి ఎక్స్ప్రెస్కు యాభై ఏళ్లు.. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
Godavari Express Golden Jubilee: గంటకు 57 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న గోదావరి ఎక్స్ప్రెస్
Godavari Express Golden Jubilee: గోదావరి ఎక్స్ప్రెస్కు యాభై ఏళ్లు.. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
Godavari Express Golden Jubilee: ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాద్ రావాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు.. గోదావరి ఎక్స్ ప్రెస్. సమయపాలన, భద్రతకు ఈ రైలు పెట్టింది పేరు. అందుకే ఈ రైలులో ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. రాజధానికి వెళ్లేందుకు అనువైన ప్రయాణ సాధనంగా ఈ రైలును భావిస్తారు. పైగా ఈ రైలులో ప్రయాణిస్తే అనుకున్న పనులు అవుతాయని ఒక నమ్మకం.
అందుకే ఈ రైలు ప్రయాణానికి ఎక్కువమంది ఇష్టపడతారు. గతంలో ప్రజా ప్రతినిధులు సైతం ఈ రైలు ద్వారా రాకపోకలు సాగించేవారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య వారధిగా నిలుస్తోంది ఈ రైలు. బుల్లెట్ రైళ్ల వైపు కాలం పరుగులు పెడుతున్న సమయంలో.. 50 వసంతాలు పూర్తిచేసుకుంది గోదావరి ఎక్స్ ప్రెస్.
యాభై ఏళ్ల క్రితం పట్టాలపై పరుగులు తీయడం ప్రారంభించినప్పటి నుంచి చెక్కు చెదరని ప్రయాణికుల ఆదరణ దక్కించుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్ యాభై ఏళ్ల మైలురాయిని అధిగమించింది. దీంతో రెండు రైల్వే జోన్ల పరిధిలో ప్రతి స్టేషన్లో గోదావరి సంబరాలు నిర్వహించారు. విశాఖలో మొదలై హైదరాబాద్ చేరుకునే గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలపై ప్రయాణం ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో భారతీయ రైల్వే వేడుకగా దాని పుట్టిన రోజు నిర్వహించింది. అరుదైన గౌరవం దక్కించుకున్న గోదావరి ఎక్స్ప్రెస్ను అందంగా ముస్తాబు చేసి వేడుకలు నిర్వహించారు.
ప్రస్తుతం ఈ రైలు 12727,12728 నంబర్లతో విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. 1974 ఫిబ్రవరి ఒకటో తేదీన మొదటిసారిగా ప్రారంభించిన ఈ రైలు నెంబర్ 7007, సికింద్రాబాద్ వాల్తేరు మధ్య రైలు నెంబర్ 7008గా ప్రవేశపెట్టారు. మొత్తం 18 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. 710 కిలోమీటర్ల ప్రయాణ దూరం కాగా.. ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు. 17 బోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గోదావరి రైలులో ప్రయాణం శుభం, శుభప్రదం, శ్రేయస్కరం అన్న సెంటిమెంట్ను సొంతం చేసుకోవడం విశేషం.